‘కిక్‌ - 2’ నటుడికి 6 నెలల జైలు శిక్ష

24 Apr, 2018 12:30 IST|Sakshi

బాలీవుడ్‌ హస్యనటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌కు ఢిల్లీ కార్కారదుమ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్‌జీ అగర్వాల్‌ దగ్గర నుంచి తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి చెల్లించనందుకు గాను,  కోర్టు ఈ శిక్ష విధించింది. అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అమిత్‌ అరోరా ఈ నటుడికి 6 నెలల జైలు శిక్షతో పాటు, 11.2 కోట్ల  రూపాయలు జరిమానాను, అతని భార్య రాధ యాదవ్‌కు 70 లక్షల జరిమానాను విధించారు. తరువాత రాజ్‌పాల్‌కు 50వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

2010 లో రాజ్‌పాల్‌ తొలిసారి తానే నటిస్తూ దర్శకత్వం వహించబోయే సినిమా ‘ఆట పాట లపాట’ కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్‌ కంపెనీ యజమాని ఎమ్‌జీ అగర్వాల్‌ దగ్గర నుంచి 5కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వడ్డీతో  కలిపి 2011, డిసెంబర్‌ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చి సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్‌ పాల్‌ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

రాజ్‌పాల్‌ హిందీలో ‘భూల్‌భూలయ్యా’, ‘పార్టనర్‌’, ‘హంగామా’ వంటి హిందీ చిత్రాల్లోనే కాక తెలుగులో ‘కిక్‌ -2’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు

మరిన్ని వార్తలు