రైజింగ్‌లో త్రిష!

23 Apr, 2016 02:30 IST|Sakshi
రైజింగ్‌లో త్రిష!

సినిమా రంగాన్ని మాయా ప్రపంచం అని ఊరికే అనలేదు. ఇది ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో కూర్చోపెడుతుందో ఊహించడం కష్టం. ఇక తన పైని అయిపోయింది అనుకున్న వాళ్లు అనూహ్యంగా టాప్ లెవల్‌లో వెలిగిపోతుంటారు.దీనినే సెకెండ్ ఇన్నింగ్స్ అంటుంటారు. నయనతార ప్రస్తుతం ఇలానే దక్షిణాది సినీ పరిశ్రమను దున్నేస్తున్నారు. ఇక ఈ విషయంలో నటి త్రిష ఏమీ తీసిపోలేదు. ఈ మధ్య సరైన హిట్స్ లేకపోవడంతో త్రిష పనైపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నై అరిందాళ్ చిత్రంలో ఒక చిన్నారికి తల్లిగా వైవిధ్య పాత్రలో తనదైన నటనను ప్రదర్శించి మంచి పేరుతో పాటు విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఆ తరువాత నటించిన అరణ్మణై-2 చిత్రం కూడా సక్సెస్ బాటలో పయనించడంతో త్రిష పేరు మరో సారి లైమ్ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చైన్నై చిన్నది నాయకి చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ధనుష్ కథానాయకుడిగా రాజకీయ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న కొడి చిత్రంలో త్రిష రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.అయితే తాజాగా ఇందులో త్రిషది రాజకీయనాయకురాలి పాత్ర కాదని, రాజకీయనాయకుడైన ధనుష్‌కు జంటగా నటిస్తున్నారని తెలిసింది.

ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రంలో విజయశాంతి పాత్ర తరహాలో చాలా బలమైన పాత్ర చేస్తున్నారట. ఇది తను ఇంత వరకూ నటించనటు వంటి పాత్ర అని సమాచారం.దీంతో కొడి చిత్రం తన స్థాయిని మరింత పెంచే చిత్రం అవుతుందనే ఆశాభావాన్ని ఆశాభావంతో త్రిష ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే  ఈ బ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ మంచి రైజింగ్‌లో ఉందని భావించవచ్చు.