సీరియల్ కిల్లర్ గా మారిన డాన్సర్

5 Feb, 2016 10:18 IST|Sakshi
సీరియల్ కిల్లర్ గా మారిన డాన్సర్

న్యూఢిల్లీ:  ప్రొఫెషనల్ డాన్సర్ గా రాణించాలనుకున్న ఓ మైనర్ బాలుడు వరుసగా హత్యలకు పాల్పడ్డం  ఆందోళన రేపింది. పాపులర్ డ్యాన్స్‌ రియాల్టీ షో లో పాల్గొనాలనే కోరికను నెరవేర్చుకునేందుకు గతేడాది  బాలుడిని హత్య చేసినవాడే  తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వున్న వృద్ధురాలిని అంతమొందించాడు.

ఢిల్లీలోని బికె దత్తా కాలనీలో నివసించే మితిలేష్ జైన్(65) తన నివాసంలో  చనిపోయివుండగా బంధువులు గమనించారు. మొదట సహజ మరణంగానే అందరూ భావించారు.  కానీ ఆమెకు సంబంధించిన, నగదు, నగలు, సెల్  ఫోన్స్ కనపించకపోవడంతో  అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు.  గొంతు నులిమి హత్య చేసినట్టుగా పోస్ట్మార్టం నివేదికలో తేలింది. ఈ లోపు కనిపించకుండా పోయిన ఆమె మొబైల్ ఆన్ అయింది. దీని ఆధారంగా కూపీ లాగిన పోలీసులు నిందితుడి వివరాలు తెలుసుకొని షాక్ అయ్యారు.

గత సెప్టెంబర్ లో 13 ఏళ్ల స్వప్నేష్ గుప్తాను హత్య చేసిన డాన్సర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి నివ్వెర పోయారు. ఫరీదాబాద్ లోని అతని నివాసంలో గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. రియాల్టీషో లో  పాల్గొనడానికి అవసరమైన డబ్బుల కోసమే ఆమెను హత్యను చేసినట్టు విచారణలో  నేరాన్ని అంగీకరించాడు.   

కాగా గతంలో ఈ డాన్సర్ , మరో అమ్మాయితో కలిసి పథకం ప్రకారం సప్నేష్ ను మభ్యపెట్టి ఉత్తరాఖండ్‌ తీసుకెళ్లి, గొంతు నులిమి చంపేసి  కొండమీదనుంచి తోసేశారు. అనంతరం 60 వేల రూపాయలు ఇవ్వాలంటూ బాలుడి తండ్రిని డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో  విచారణ అనంతరం జువైనల్ హోంకు తరలించారు. మంచి ప్రవర్తన కారణంగా కరెక్షన్ హోం నుంచి ఇటీవలే  విడుదలయ్యాడు. దాదాపు ఆరు నెలల కాలంలో రెండు హత్యలకు పాల్పడడం బాల నేరస్థుల సంస్కరణ వ్యవస్థకు సవాలుగా నిలిచింది.

మరిన్ని వార్తలు