అమిత్‌ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం

13 Jun, 2019 11:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో జాతీయ పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధరరావు, రాం మాధవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలు,  పార్టీ నూతన  అధ్యక్షుడి ఎంపికపై ఈ సమావేశంలో అమిత్‌ షా చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారుపై సమాలోచనలు జరపనున్నారు. ఇక ఆర్గనైజేషన్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవికి అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను ప్రతిపాదించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రతిపాదనను బలపరుస్తూ రాష్ట్రాల అధ్యక్షులు తీర్మానం చేయనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై నుంచి చేపట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుగానే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

>
మరిన్ని వార్తలు