కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి? 

20 Dec, 2023 04:41 IST|Sakshi

ప్రాజెక్టు పనుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ అంటే  కేసును పక్కదారి పట్టించడమే: రఘునందన్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. అందుకు సీఎంకి ఉన్న అభ్యంతరాలేమిటి? సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు... మేడిగడ్డ అందులో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయా లని కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ అంటే కేసును పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లో రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో టీపీసీ సీ అధ్యక్షుడిగా రేవంత్‌ కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి రేవంత్‌ లేఖ కూడా రాశారని చెప్పారు. ఇప్పుడు సీఎం హోదా లో తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకు, కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. 

కాళేశ్వరం కథ కంచికి చేర్చాలనే కుట్ర 
కాంగ్రెస్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథ కంచికి చేర్చాలని చూస్తోందని రఘునందన్‌ ఆరోపించారు. ఈ ప్రాజె క్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్‌ పలు దఫాలుగా ఉత్తరాలు రాసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 20న రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ కుమార్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చిందన్నారు.

ఈ లేఖకు ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ వరకే విషయా న్ని పరిమితం చేస్తున్నారని, ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్ట్‌ సంస్థపైకి మాత్రమే నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అని రఘునందన్‌ వ్యాఖ్యానించారు.   

>
మరిన్ని వార్తలు