‘ఆయన రెండో జకీర్‌ నాయక్‌’

16 Nov, 2019 18:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ రెండో జకీర్‌ నాయక్‌ (ఇస్లాం బోధకుడు)లా తయారవుతున్నారని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఆరోపించారు. జకీర్‌ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలని ఓవైసీ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకువెళుతుందని అన్నారు. కాగా, తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు దక్కడం కోసమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. మసీదును నిర్మించేందుకు ఏ ఆలయాన్ని కూల్చలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని..మసీదును మాకు తిరిగివ్వాలని తాము కోరుకుంటున్నామని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు