శత్రుఘ్న సిన్హాకు మోదీ షాక్‌

17 Jan, 2019 15:22 IST|Sakshi

పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీపై పలు సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడుతున్న ఆ పార్టీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ షాక్‌ ఇచ్చారు. బీజేపీతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి వైదొలగాలని, ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్‌ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. బీజేపీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు.

సిన్హాకు బీజేపీతో సమస్యలుంటే పార్టీకి రాజీనామా చేయాలని సుశీల్‌ మోదీ సూచించారు. ‘అసలు ఆ‍యన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నాని ఎలా చెబుతా’రని ప్రశ్నించారు. పార్టీ సీనియర్‌ నేతలుగా చలామణి అవుతున్న యశ్వంత్‌, శత్రుఘ్న సిన్హాలు తరచూ బీజేపీ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని కేవలం ముందస్తు ప్రణాళికతో కూడిన ఇంటర్వ్యూలు ఇవ్వడం మినహా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు నేరుగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేరని సిన్హా ఇటీవల ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వన్‌మాన్‌ షోలా తయారైందని కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు