మణిపూర్‌లో ముగిసిన ప్రచారం

6 Mar, 2017 18:40 IST|Sakshi
మణిపూర్‌లో ముగిసిన ప్రచారం
మణిపూర్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెర పడింది. మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 స్ధానాలు ఉండగా.. 38 స్ధానాలకు తొలిదశలో ఎన్నికలు జరిగాయి. 84 శాతం మంది ప్రజలు తొలిదశ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ నెల 8వ తేదీన మిగిలిన 22 స్ధానాలకు పోలింగ్‌ జరగనుంది. మణిపూర్‌ ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్‌ చాను షర్మిళ కూడా రెండో దశ ఎన్నికల్లో పోటీలో ఉ‍న్నారు. 
 
మొత్తం 98 మంది అభ్యర్థులు రెండో దశ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కాగా, రాష్ట్ర రాజకీయాల్లోని హేమాహేమీలందరూ రెండో దశ ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. వీరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక్రమ్‌ ఇబొబి సింగ్‌, డిప్యూటీ సీఎం గైకన్గమ్‌లు కూడా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మణిపూర్‌లో విజయపతాకం ఎగరేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
>
మరిన్ని వార్తలు