కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

2 Jul, 2020 18:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ‌ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ఏడాది చివరిలో బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు