కోవిడ్‌-19: అవసరం అనిపిస్తేనే చేయించుకోండి.. 

13 Mar, 2020 09:37 IST|Sakshi

ప్రజలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ సూచన

అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌

విదేశాలకు వెళ్లి వచ్చాక 14రోజుల పాటు ఇంట్లోనే ఉండండి

రాష్ట్రంలో మరో ముగ్గురికి కోవిడ్‌ 

వైద్యుల ధ్రువీకరణ.. 13కి చేరిన బాధితులు 

జాతర, పర్యటన సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు 

సాక్షి ముంబై: కోవిడ్‌–19 భయాందోళనలు రేకేత్తిస్తున్న నేపథ్యంలో భయంతో పరీక్షల కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కట్టవద్దని రాష్ట్ర ప్రజలను ఉద్దవ్‌ ఠాక్రే కోరారు. కోవిడ్‌ నేపథ్యంలో దగ్గు, ఇతర లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరు కోవిడ్‌-19 భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తుండటంతో రద్ధీ పెరిగిపోతోంది. ఫలితంగా అప్పటికే ఎవరికైనా కోవిడ్‌ సోకి ఉంటే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే ఆస్పత్రులకు రమ్మని సీఎం సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ గడగడలాడిస్తున్న కోవిడ్‌–19 ముంబైతోపాటు నాగ్‌పూర్‌లో ప్రవేశించింది. అక్కడ కూడా ఒకరికి కోవిడ్‌ సోకిందని నిర్దారణ అయింది. మరోవైపు పుణేలో మరో వ్యక్తికి కోవిడ్‌ సోకిందని తెలిసింది. దీంతో పుణేలో తొమ్మిది, ముంబైలో ఇద్దరు, నాగ్‌పూర్‌లో ఒక్కరు, థానేలో ఒక్కరు ఇలా వ్యాధి బారిన పడినవారి సంఖ్య 13 చేరిందని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. అయితే కోవిడ్‌–19 తీవ్రత (వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది) స్వల్పంగా ఉందని దీంతో ఎవరు భయాందోళనలు చెందవద్దన్నారు. కాని రాష్ట్ర ప్రజలతోపాటు అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
(అమెరికా వివరణ ఇవ్వాల్సిందే: చైనా)


కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..

కోవిడ్‌–19 నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే మంత్రాలయం నుంచి గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల కార్పొరేషన్‌ కమిషనర్‌లు, జిల్లా పరిషత్‌ అధికారులతో కోవిడ్‌–19 గురంచి వీడియో కాన్ఫరెన్సలో మాట్లాడారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల అధికారులకు కోవిడ్‌–19కు సంబంధించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 మందికి కోవిడ్‌–19 సోకిందని నిర్థారణ అయింది. కాని వారికి కోవిడ్‌–19 తీవ్రత స్వల్పంగా ఉందని దీంతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని కాని అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య సేవ అందించే సిబ్బందికి కావాల్సిన మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకుని వారికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో ని పట్టణాలు, నగరాల్లోని టూర్‌ ఆపరేటర్లందరు ఇటీవలే విదేశాలను వెళ్లివచ్చిన వారితోపాటు విదేశాలలో ఉన్నవారి వివరాలు ఆరోగ్య శాఖ అధికారులకు అందించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, తీర్థక్షేత్రాల వద్ద రద్దీ చేయవద్దన్నారు. ఈ ప్రాంతాలపై నియంత్రణ ఉంచా లని అదేవిధంగా జనజాగృతి చేయాలన్నారు.  (అలా కరోనా వైరస్‌ను జయించాను!)

14 రోజుల దూరం.. 
కోవిడ్‌–19 భయాందోళనలు రేకేత్తిస్తున్న నేపథ్యంలో పరీక్షల కోసం ఆసుపత్రుల వద్ద రద్దీ చేయవద్దని ఉద్దవ్‌ ఠాక్రే ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన పర్యాటకుల వివరాలను టూర్‌ ఆపరేటర్స్‌ ఆయా జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులకు ఇవ్వాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ముందుగా కోవిడ్‌ సోకిందా లేదా అనే విషయంపై అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలన్నారు. ఈ 14 రోజులలో ఏవైనా కోవిడ్‌–19కు సంబంధించిన లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సీఎం సూచించారు.  

వారిని వేరుగా ఉంచాలి: సీఎస్‌ ప్రదీప్‌ 
చైనా, ఇరాన్, ఇటలీ, దక్షిణ కోరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ మొదలగు ఏడు దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 100 శాతం క్వరంటైన్‌ (వేరుగా ఉంచాలి) ఉంచాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. ఈ ఏడు దేశాల నుంచి 15 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ప్రయాణం చేసి వచ్చారో వారందరు 14 రోజులపాటు ఇంట్లోనే వేరే గదిలో ఒంటరిగా ఉండటం తప్పనిసరి అంటూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పాటించాలన్నారు. పుణే, ముంబై, నాగపూర్‌ మొదలగు ప్రాంతాల్లో వేరుగా (క్వరాంటైన్‌)  ఉంచేందుకు ఎలాంటి సదుపాయాలు చేశారనే విషయంపై వివరాలు వెంటనే అందించాలని ఆయా మున్సిపల్‌ కమిషనర్‌లకు సూచించారు. అదేవిధంగా ఇతర కార్పొరేషన్‌ కమిషనర్‌లు కూడా ఇలాంటి వివరాలు శుక్రవారం వరకు అందించాలన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేయాలని ప్రదీప్‌ పేర్కొన్నారు. జాతర, పర్యటన, సామూహిక కార్యక్రమాలు, ప్రజలు గుమిగూడే విధంగా చేసే కార్యక్రమాలన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్‌–19 వ్యాప్తి చెందకుండా పట్టణాలు, నగరాల్లోని టూర్‌ కంపెనీలను రాబోయే కొన్ని రోజులపాటు బుకింగ్‌లు నిలిపివేయాలని కూడా సూచించారు. సార్వజనిక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కోవిడ్‌–19 లక్షణాలు  కన్పిస్తే వారి గురించి వివరాలు తెలుసుకునేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసిజర్‌ (ఎస్‌ఓపి)తో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామగ్రామానికి ఈ బృందాలు ఏర్పాటు చేసి అలాంటి లక్షణాలున్నవారు కన్పిస్తే వెంటనే వారిని వేరుగా ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అయితే క్వారంటైన్‌ సదుపాయం ఆసుపత్రులకు కొంత దూరంగా చేయాలని కాని ప్రత్యేక వార్డులు మాత్రం ఆసుపత్రులలో ఉండాలని పేర్నొన్నారు. 

మరిన్ని వార్తలు