సాక్షి, న్యూఢిల్లీ : మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!)
ఉపశమన చర్యలు
మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి ప్రభావం తీవ్రం కావడంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి సెనేటర్లు, వైట్హౌజ్ బృందం అంగీకరించింది. వ్యాపారవేత్తలకు, కార్మికులకు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్దీపన ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేస్తారు.
కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపార వర్గాలకు కూడా ఈ ప్యాకేజీ డబ్బు వెళ్తుంది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ కావడం విశేషం. ప్యాకేజీ ప్రకటన స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 30 వేల స్థాయిని అధిగమించింది. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా మునుపటి ముగింపు (75.88)తో పోలిస్తే లాభపడుతోంది. అయితే మార్చి ఎఫ్అండ్ఓ కాంటాక్టు నేటితో ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం వుందనీ అప్రమత్తత అవసరం ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.