కరోనా: మనుషులకు సరే, మరి దేవుళ్లకు

11 Mar, 2020 15:35 IST|Sakshi

వారణాసి: కోవిడ్‌-19(కరోనా వైరస్‌).. ఈ పేరొక భూతం.. ఈ మాటొక విపత్తు.. దీని ఉనికి మనకు వినాశనం. ప్రస్తుతం కరోనా భయం లేనిదెవరికి. ఇది దేశంలోకి ఎంటరైన క్షణం నుంచి భారతీయుల హైరానా అంతా ఇంతా కాదు. ‘మాస్క్‌లు ధరించండి, దగ్గు, జలుబు చేస్తే ఆసుపత్రికి వెళ్లండి, ఓ సారి పరీక్ష చేయించుకోండి.. కరచాలనం వద్దు, నమస్కారం ముద్దు, వీలైనంతవరకు జనసందోహం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకండి..’ ఇలా ఒకటేమిటి బోలెడు సూచనలు వినిపిస్తున్నాయి. సరే బయట తిరగడం కూడా వద్దంటున్నారని కాసేపు ఫోన్‌ మాట్లాడదామనుకుంటామా..! ఇంతలో అటు నుంచి దగ్గు. ఇంకేముందీ.. కాలర్‌ ట్యూన్‌కు కరోనా సోకినట్టుందని దాని రొద వినలేక ఫోన్‌ అవతలి వారికి కనెక్ట్‌ అయిపోయేలాగా మనమే డిస్‌కనెక్ట్‌ అవుతున్నాం(ఫోన్‌ కట్‌ చేస్తున్నాం). సరే మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. మరి దేవుళ్లు. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని తిట్టుకోకండి. దేవుడికి కరోనా సోకకుండా ఓ పూజారి విగ్రహానికి ఫేస్‌ మాస్క్‌ తొడిగి పూజలు చేస్తున్నాడు.(పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే‌ షాక్)

ఈ విచిత్రం చూడాలంటే ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రహ్లాదేశ్వర ఆలయానికి వెళ్లాలి. ఇక అక్కడికి వచ్చిన భక్తులు సైతం శివలింగానికి మాస్కు చూసి ఖంగుతిన్నారు. అందరినీ ఆదుకునే దేవునికి ఆపద వస్తుందా? అని నోరెళ్లబెట్టారు. దీనిపై ఆలయ పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే మాట్లాడుతూ ‘వాతావారణం చల్లగా ఉన్నప్పుడు శిలామూర్తులకు వస్త్రాలు కప్పుతాం. ఉక్కపోతగా ఉన్నప్పుడు ఏసీ, ఫ్యాన్‌లు పెడుతాం. ప్రస్తుతం కరోనా ప్రబలుతోంది కాబట్టి విగ్రహానికి ఫేస్‌ మాస్క్‌ పెట్టాం. కరోనాపై అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేశారు. అంతేకాక ఆలయానికి వచ్చే భక్తులకు సైతం కొన్ని నిబంధనలు విధించాడు. భక్తులెవరూ దేవతామూర్తుల విగ్రహాలను తాకరాదని పేర్కొన్నారు. ఎవరైనా ఒకరు విగ్రహాన్ని తాకడం వల్ల దాన్ని మిగతావారు తాకినప్పుడు వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. ఇక ఈ ఆలయంలో పూజారితోపాటు భక్తులు కూడా మాస్కులు ధరించే పూజాపునస్కారాలు చేయడం గమనించవచ్చు. (కరోనాతో వ్యక్తి మృతి : భారత్‌లో తొలి కేసు..!)

చదవండి: కరోనా భయంతో ఇళ్లలోనే ఇటాలియన్లు

>
మరిన్ని వార్తలు