చిన్నారిపై అత్యాచారం.. దోషులకు 20 ఏళ్ల జైలు

31 Jan, 2020 06:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీనగర్‌లో 2013లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల దోషులుగా తేల్చిన కోర్టు.. గురువారం వారికి శిక్ష ఖరారు చేసింది. దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు నష్ట పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని అదనపు సెషన్స్‌ జడ్జి నరేశ్‌ కుమార్‌ మల్హోత్రా ఆదేశించారు. గాంధీనగర్‌లో ఐదేళ్ల చిన్నారిని 2013 ఏప్రిల్‌ 15న మనోజ్‌ షా, ప్రదీప్‌ కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని అత్యంత క్రూరంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఘటన జరిగిన 40 గంటల తర్వాత బాలికను గుర్తించిన పోలీసులు.. ఆమెకు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. దోషులకు జీవిత ఖైదు విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితురాలి తరఫు లాయర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు