-

ఇంటిని చుట్టుముట్టి..ఆపై మట్టుబెట్టారు

6 May, 2020 15:33 IST|Sakshi

హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం సుదీర్ఘంగా సాగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజహిదీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ మరణించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ ఎనిమిదేళ్లుగా భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్నాడు. రంజాన్‌ సందర్భంగా తల్లితండ్రులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చాడన్న సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రియాజ్‌ను మట్టుబెట్టాయి. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టి బీగ్‌బోరా గ్రామాన్ని జల్లెడపడుతుండగా ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఇది బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి.

బేగ్‌పురాలోని తన ఇంటిలో రియాజ్‌ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి. కశ్మీర్‌లో మిలిటెన్సీ పోస్టర్‌ బాయ్‌గా పేరొందని బుర్హాన్‌ వనీ మరణానంతరం హిజ్బుల్‌ పగ్గాలను రియాజ్‌ నైకూ చేపట్టారు. కాగా, పుల్వామాలో నైకూను మట్టుబెట్టిన అనంతరం జిల్లాలోని మరో గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఇక హంద్వారాలో కొద్దిరోజుల కిందట ఉగ్రమూకల దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

చదవండి : భీకర పోరు : ఐదుగురు జవాన్ల మరణం

మరిన్ని వార్తలు