విమానం దిగుతుండగా.. గేర్‌ ఫెయిలైంది!

4 Mar, 2016 10:20 IST|Sakshi
విమానం దిగుతుండగా.. గేర్‌ ఫెయిలైంది!

ముంబై: 127 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబైలో గురువారం విమానం దిగుతుండగా.. ఒక్కసారిగా ల్యాండింగ్ గేర్ బద్దలైంది. దీంతో ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే పూర్తిగా బ్లాక్ అయింది. అదృష్టంకొద్దీ ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపినట్టు జెట్‌ ఎయిర్‌వేస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన విమానం ముంబైలోని ప్రధాన రన్‌వేపై దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దీంతో విమానాశ్రయ అధికారులు సెంకడరీ రన్‌వే మీదుగా ఫ్లయిట్ ఆపరేషన్స్ చేపట్టారు. బోయింగ్ 737 విమానమైన 9డబ్ల్యూ 354లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఈ లోపాన్ని సరిచేయడానికి ఇంజినీర్ల బృందం తనిఖీలు జరుపుతున్నదని జెట్‌ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన రన్‌వేపై ఆగిపోయిన విమానాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలను ఇంజినీర్‌ బృందం తీసుకుంటున్నదని గురువారం నాటి ప్రకటనలో పేర్కొంది. విమానం ల్యాండింగ్ గేర్‌ చెడిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, దానిని సరిచేసి.. విమానాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

మరిన్ని వార్తలు