లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత

13 Apr, 2020 14:53 IST|Sakshi

వారణాసి : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారత్‌లో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్‌ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూసివేయడంతో వారణాసి, హరిద్వార్‌ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది.  అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. (బ్రిటన్‌ కమెడియన్‌ కన్నుమూత)

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హరిద్వార్‌ ఘాట్లు మూసివేయడంతో ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూడటానికి నీళ్లు తేటగా కనిపిస్తున్నాయి. చేపలు ఇతర సముద్ర జీవులు కూడా నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగా నదిలోకి  పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వచ్చ చేరుతుందని బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ పీకే మిశ్రా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండటం, పరిశ్రమలు పనిచేయకపోవడం కారణంగా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు గంగా నది నీరు నాణ్యత పెరిగిందని ఆయన చెప్పారు. అలాగే గత కొన్ని వారాలుగా ఆ ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవ్వడంతో నీటి మట్టాలు పెరిగాయి. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు! )

కాగా కేవలం గంగా నది మాత్రమే కాకుండా యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాలుష్యంతో నిండిన నది ప్రస్తుతం క్లీన్‌గా కనిపిస్తోంది. ఇక రోడ్లపై వాహానాలు తక్కువ ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం సైతం కనుమరుగయ్యింది. అలాగే ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. (సెహ్వాగ్‌కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..! 

>
మరిన్ని వార్తలు