అనంత్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు

14 Nov, 2018 01:01 IST|Sakshi

అంత్యక్రియలకు హాజరైనఉప రాష్ట్రపతి వెంకయ్య, అడ్వాణీ

 కేంద్ర కేబినెట్‌ సంతాపం

సాక్షి, బెంగళూరు: అశేష అభిమానులు, అగ్రనేతల కన్నీళ్ల మధ్య కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌ (59) పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. బెంగ ళూరు దక్షిణ ఎంపీ అయిన అనంత్‌ కుమార్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో కన్నుమూయడం తెలిసిందే. స్మార్త బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం, అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. నగరంలోని చామరాజపేట హిందూ రుద్రభూమిలో మంగళవారం మధ్యా హ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరిగాయి. ఉదయం బెంగళూరు బసవనగుడిలో ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని బీజేపీ కార్యాలయం ‘జగన్నాథ భవన్‌’కు తరలించారు. అనంతరం నేషనల్‌ కాలేజీ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆయనకు నివాళులర్పించి, సతీమణి తేజస్వినిని, కూతుళ్లను ఓదార్చారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బీజేపీ అధినేత అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులు సహచరునికి నివాళులర్పించారు. వేలాది మం ది ప్రజలు సందర్శించారు. కొంతసేపటికి సైనిక వాహనంలో భౌతిక కాయాన్ని రుద్రభూమికి ఊరేగింపుగా తరలించారు. 

చితికి నిప్పంటించిన సోదరుడు  
అనంత్‌కుమార్‌ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించి అంతిమ సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంత్‌కుమార్‌ భౌతిక కాయంపై కప్పిన జాతీయ జెండాను సతీమణి తేజస్వినికి సైనికాధికారులు అంద జేశారు. సంప్రదాయం ప్రకారం చితికి సోద రుడు నందకుమార్‌ నిప్పంటించారు. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ తేజస్విని విలపిం చారు. అంతిమయాత్రలో బీజేపీ అధినేత అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్‌ఎస్‌ఎస్‌ సహ కార్యదర్శి భయ్యాజీ జోషి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రవి శంకర్‌ ప్రసాద్, పియూష్‌ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులతో పాటు గవర్నర్‌ వజూభాయ్‌వాలా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ అనంతకుమార్‌ మృతికి సంతాపం తెలిపింది

మరిన్ని వార్తలు