అపర శ్రవణుడు తిరిగిరాక

25 May, 2020 07:48 IST|Sakshi
మాతృభూమిని ముద్దాడుతున్న తల్లీకుమారులు

తల్లితో కలిసి తీర్థయాత్రలు 

స్కూటర్‌పై 5,600 కి.మీ. ప్రయాణం

కర్ణాటక, తుమకూరు: తల్లితో కలిసి దేశంలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన అపర శ్రవణ కుమారుడు సొంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వచ్చాడు. శనివారం సాయంత్రం జిల్లా సరిహద్దులోకి రాగానే నేలను ముద్దాడి తమ మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటారు. మైసూరుకు చెందిన కృష్ణకుమార్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీరు. తన 70 ఏళ్ల తల్లి చూడా రత్నను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  

2018 జనవరి నుంచి యాత్ర  
ఆ తర్వాత తన తల్లితో కలసి స్కూటర్‌పై గత 2018 జనవరి 14న మైసూరు నుంచి తన యాత్రను ప్రారంభించారు. సుమారు 5600 కిలోమీటర్లు ప్రయాణించారు. వీరిద్దరు ఉత్తర భారతదేశంలోని కైలాస పర్వతం, నేపాల్, మానస సరోవరం, భూటాన్, టిబెట్‌లలోని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో యాత్రను ముగించుకుని వచ్చారు. సరిహద్దు చెక్‌పోస్టులో ఆరోగ్య శాఖ అధికారులు వీరిరువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రానికి ఆహ్వానించారు. తహశీల్దార్‌ డాక్టర్‌ విశ్వనాథ్, కొడిగెనహళ్లి పోలీసు స్టేషన్‌ పీఎస్‌ఐ పాలాక్ష ప్రభు తల్లీ కుమారులకు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు