ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరనున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివేంద్ర సింగ్ రాజ భోసాలె, వైభవ్ పిచద్, సందీప్ నాయక్తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కార్ ముంబై గర్వారే క్లబ్ హౌస్లో బుధవారం బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పలువురు ఎన్సీపీ దిగ్గజ నేతలు సైతం బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు కాషాయ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
విపక్ష పార్టీలకు చెందిన నేతలను ఒత్తిడి చేసి బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. పార్టీలో అసమ్మతి పెరుగుతుండటంపై శరద్ పవార్ ఆత్మవిమర్శ చేసుకోకుండా తమపై బురదచల్లడం మానుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి పెద్దసంఖ్యలో నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుండగా తాము ఎంపిక చేసిన కొద్దిమందినే పార్టీలోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.