ఎన్డీ తివారీ కన్నుమూత

20 Oct, 2018 01:58 IST|Sakshi

గుండెపోటుకు చికిత్స పొందుతూ మృతి

సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నారాయణ్‌దత్‌ తివారీ(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతేడాది బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో తివారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నైనిటాల్‌లో 1925, అక్టోబర్‌ 18న నారాయణ్‌ దత్‌ తివారీ జన్మించారు.

1947లో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌ సీఎంగా చేశారు. యూపీకి మూడుసార్లు, ఉత్తరాఖండ్‌కు ఒకసారి సీఎంగా చేశారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజవ్‌ హయాంలో ఆర్థికం, పెట్రోలియం, విదేశాంగ  మంత్రిగా చేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. కాగా తివారీ మృతిపై ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, నేతలు అహ్మద్‌ పటేల్, గులాం నబీ ఆజాద్‌ తదితరులు తివారీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.  

మరిన్ని వార్తలు