‘ఉడి’ సినిమాను ప్రశంసించిన నిర్మల సీతారామన్‌

28 Jan, 2019 11:58 IST|Sakshi

బెంగళూరు : మెరుపు దాడుల నేపథ్యంలో బాలీవుడ్‌లో ‘ఉడి : ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్కి కౌశల్‌, యామీ గౌతమ్‌, పరేష్‌ రావల్‌, మోహిత్‌ రైనా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌.. ఆదివారం మాజీ ఆర్మీ ఉద్యోగులతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. 

అనంతరం ‘పవర్‌ ప్యాక్డ్‌ మూవీ. యామీ గౌతమ్‌, విక్కీ కౌషల్‌, పరేష్‌ రావల్‌, మోహిత్‌ రైనా తమ అద్భుత నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు’ అంటూ నిర్మల సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు సినిమాలో విక్కీ కౌశల్‌ చెప్పిన క్యాచీ డైలాగ్‌.. ‘హౌ ఈజ్‌ ద జోష్‌’ అంటూ థియేటర్‌లో నినదాలు చేసిన వీడియోను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ‘నిర్మలాజీ.. హీరో కన్నా మీరే చాలా పవర్‌ఫుల్‌గా ఈ డైలాగ్‌ చెప్పారు’ అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు.

సెప్టెంబరు 18, 2016 లష్కర్‌ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసింది.

మరిన్ని వార్తలు