సమోసా ఇచ్చి.. మతం మారాలన్నారు!

10 Mar, 2018 17:24 IST|Sakshi

సాక్షి, లక్నో: బస్తీలో నివసించే కొందరికి సమోసాలు ఇచ్చి, క్రైస్తవమతంలోకి మార్పించే యత్నం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆగ్రాలోని జగదీశ్ పురలో మూడురోజుల కిందట జరిగిన దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. జగదీశ్ పురలోని సెక్టార్-4 వికాస్ కాలనీలో మురికివాడల్లో కొందరు నివాసం ఉంటున్నాం.

గురువారం రోజు కొందరు క్రైస్తవమత ప్రచారకులు మా వద్దకు వచ్చారు. వారిలో ఓ పాస్టర్, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. మొదట మమ్మల్ని కలిసిన వెంటనే వారు మాకు, మా పిల్లలకు సమోసాలు పంచిపెట్టారు. సమోసాలు తింటుంటూ క్రైస్తవ మతంలోకి మారాలంటూ సూచించారు. తాము ఆశ్చర్యపోయి చూస్తుంటే మీరే ఆందోళన చెందొద్దు.. మీకు ఎన్నో వసతులు కల్పిస్తాం. మీ పిల్లలకు చదువు చెప్పిస్తామని ఆ పాస్టర్, సిస్టర్స్ చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఏం జరుగుతుందని ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే పాస్టర్ తన దుస్తులు మార్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారని మాయా అనే స్థానికురాలు తెలిపారు.

ఆగ్రా ఎస్పీ సన్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ.. ఓ సంస్థ నుంచి ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాం. చిన్నారుల విద్య గురించి బస్తీ వారికి అవగాహన కల్పించడానికి మహిళా దినోత్సవరం రోజు వెళ్లినట్లు క్రైస్తవ మిషనరీ పేర్కొంది. అవగాహన కల్పించి అక్కడినుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. కాగా, మురికివాడ నుంచి మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరించారు. అయితే ఓ వర్గం మాత్రం మత మార్పిడి యత్నం జరిగిందని ఆరోపించింది.
 

మరిన్ని వార్తలు