చెన్నై: మహిళా విలేకరి చెంపపై తట్టినందుకు తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమె తన మనవరాలి వంటిదనీ, విలేకరిగా ఆమె పనిని మెచ్చుకుంటూ అప్యాయతతో చెంపపై తట్టానని పురోహిత్ వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్ మేగజీన్లో విలేకరిగా పనిచేసే లక్ష్మి సుబ్రమణియన్ మంగళవారం పురోహిత్ను ఓ ప్రశ్న అడగ్గా, దాన్నుంచి తప్పించుకునేందుకు పురోహిత్ ఆమె చెంపపై తట్టి వెళ్లిపోయారు.
దీంతో ఆగ్రహించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి గవర్నర్ చర్య పట్ల నిరసన వ్యక్తం చేశాయి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేయడంతో చివరకు పురోహిత్ క్షమాపణ కోరుతూ లక్ష్మి సుబ్రమణియన్కు లేఖ రాశారు. దీంతో గవర్నర్ను మన్నించిన ఆమె.. ఆయన ప్రవర్తించిన తీరు మాత్రం సరైనది కాదని పురోహిత్కు ఈమెయిల్ పంపారు.