శాఖల మధ్య సమన్వయమేదీ?

17 Mar, 2016 02:00 IST|Sakshi

పఠాన్‌కోట్ దాడిలో కేంద్రం తీరుపై లోక్‌సభలో విపక్షాల ధ్వజం
 
 న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఆ ఆపరేషన్‌ను ఎన్‌ఎస్‌జీకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవటం తీవ్ర పొరపాటని అభివర్ణించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాహోర్‌లో ఆగి పాక్ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన కొద్ది రోజులకే పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరిగిందని, మోదీ లాహర్‌లో పర్యటన ఏం సాధించిందని ప్రశ్నించాయి. బుధవారం లోక్‌సభలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది.

ఉగ్రదాడి విషయంలో నిర్ణయాధికారాలను జాతీయ భద్రతా సలహాదారు సొంతం చేసుకున్నారని బీజేడీ సభ్యుడు కైలాస్ సింగ్ దేవ్  మండిపడ్డారు. పఠాన్‌కోట్‌లోనే 50 వేల సైన్యం ఉంటే.. ఉగ్రదాడిని తిప్పికొట్టే పనిని సైన్యానికే ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. పఠాన్‌కోట్ దాడి సందర్భంలో రక్షణశాఖకు, హోంశాఖకు సమన్వయం లేదని, భధ్రతపై కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించలేదని కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింథియా తప్పుపట్టారు. ఉగ్రవాదులు ఉన్నట్లు వారు దాడి చేయటానికి 48 గంటల ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ.. వారిని అంతసేపు స్వేచ్ఛగా తిరిగేలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఆరేళ్ల పాటు చేసిన కృషిని.. ప్రధాని మోదీ ఒక కప్పు కాఫీ కోసం లాహోర్ వెళ్లి వృథా చేశారని విమర్శించారు.

మరిన్ని వార్తలు