ప్రియుడితో పారిపోయిన వివాహితకు అమానుష శిక్ష!

14 Apr, 2019 12:41 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇతర కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఓ వివాహితకు వింత శిక్ష విధించారు గ్రామ పెద్దలు. ఇంట్లో నుంచి పారిపోయిన ఆమెను పట్టుకొచ్చి మరి దారుణంగా హింసించారు. పరాయి కులస్తుడితో వెళ్లినందుకు శిక్షగా భర్తను భుజంపై ఎక్కించి ఊరేగించారు. గ్రామపెద్దల ఆదేశాలతో చేసేది ఏమి లేక భర్తను తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఆమె నడక ప్రారంభించింది. ఆమె అలా నడుస్తూ వెళ్తుంటే ముందు కొందరు వ్యక్తులు డ్యాన్సు చేస్తూ గుంపుగా వెళ్లారు. అతడి బరువును మోయలేక ఆమె ఆగితే వెంటనే చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలతో కర్రలతో దాడి చేశారు. దీన్ని మరికొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పోలీసుల దృష్టికెళ్లింది.

వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన 12 మందిపై కేసునమోదు చేసినట్లు చెప్పారు. ఈ అమానుష ఘటనపై ఎస్పీ వినీత్ జైన్ మాట్లాడుతూ.. ‘10 రోజుల క్రితం సదరు మహిళ తన ప్రియుడితో పారిపోయింది. 10-12 రోజుల తర్వాత ఆ ప్రియుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ భర్త, అతని సోదరులు వచ్చారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. వారు అమానుషంగా భర్తను భుజాలపై ఎక్కించుకొని ఊరేగాలని శిక్షవిధించారు. అంతేకాకుండా చున్నీని లాగేసి తీవ్రంగా అవమానించారు. ఇలాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం’ అని  ఎస్పీ మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు