భారతీయ జర్నలిస్టుకు రూ.23 లక్షల జర్మనీ అవార్డు

14 Jul, 2013 20:23 IST|Sakshi

ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ జర్నలిస్టు తోంగమ్ రైనా ఈ ఏడాది జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. లీపింగ్‌లోని మీడియా ఫౌండేషన్ ఇచ్చే ‘ప్రైజ్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది మీడియా’ అవార్డును గెలుచుకున్నారు. రైనాతోపాటు ఇద్దరు జర్మన్‌లు, డెన్మార్క్, బెల్జియంకు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు ఈ ఏడాది అవార్డుకు ఎంపికయ్యారని ఈ మేరకు మీడియా ఫౌండేషన్ తెలిపింది.

ఓ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ అయిన తోంగమ్ రైనా.. ఆహార పంపిణీలో స్థానిక అధికారుల అవినీతి, ఆనకట్టల సందేహాస్పద నిర్మాణం, పర్యావరణ స్కామ్‌లు, భారత మహిళల పరిస్థితి వంటి అంశాలపై విశేష కథనాలు అందించారని ఫౌండేషన్ ప్రశంసించింది. 2001లో నెలకొల్పిన ఈ అవార్డు కింద విజేతలకు 30 వేల యూరోల (రూ.23.46 లక్షలు) నగదు అందజేస్తారు. కాగా, గతేడాది జూలైలో జరిగిన హత్యాయత్నంలో తోంగమ్ రైనా తీవ్రంగా గాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు