నగరాన్ని ఎలాగూ మార్చలేం పేరైనా మారుద్దాం

17 Apr, 2016 10:42 IST|Sakshi
నగరాన్ని ఎలాగూ మార్చలేం పేరైనా మారుద్దాం

అవలోకనం

మనం ప్రయాణిస్తున్న విమానం కెంపెగౌడ విమానాశ్రయాన్ని చేరుతుండగా... మీరిప్పుడు ‘‘బంగొలోరు’’లో లేదా ‘‘బంగొలూరు’’లో దిగబోతు న్నారని ఎయిర్ హోస్టెస్ చేసే ప్రకటనను వింటారు. ప్రస్తుతం ఆ నగరం పేరును చాలా మంది పలికేది అలాగే. 2014లో బీజేపీ ఆ నగరంతో పాటూ కర్ణాటకలోని మరో 11 ఇతర నగరాల పేర్లను కూడా మార్చింది. బెంగుళూరుగా ఉన్న రాజధాని నగరం పేరును బెంగళూరు అని మార్చింది. కానీ రాష్ట్రానికి వెలుపల ఉన్న ప్రజలకు ఈ కొత్త పేరుతో అంతగా పరిచయం లేకపోవడంతో ఏర్పడ్డ గందరగోళం నుంచి ‘‘బంగొలూరు’’ పుట్టుకొచ్చింది.

గురుగావ్‌ను గురుగ్రామ్‌గా మారుస్తూ బీజేపీ మరో పేరు మార్పును కూడా చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ చాలా కాలంగానే గురుగ్రామ్ అనే పేరును వాడు తోంది. కాకపోతే దాన్ని ప్రభుత్వం ఇప్పుడు అనుసరించింది. గురుగావ్ అనే పదం ఒకప్పటి అసలు పేరుకు భ్రష్టరూపం కాబట్టి, ఈ పేరు మార్పు అవస రమని మద్దతుదార్ల వాదన. మహాభారత కాలం నాటి యుద్ధ శాస్త్ర నిపు ణుడైన గురువు ద్రోణుడు, పాండవులు అక్కడే జీవించినట్టుంది.

పేరు మార్పును వ్యతిరేకించే వారిలో చాలా మంది సుదీర్ఘకాలంగా గురుగావ్ కేంద్రంగా వ్యాపారం సాగించే వ్యాపారవేత్తలు. పేరు మార్చడం వల్ల గురుగావ్‌కు ఉన్న ‘‘బ్రాండ్’’ ప్రతిష్ట మసకబారిపోతుందని వారి వాదన. అది ఉత్తర భారతదేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల కేంద్రం. పలు ప్రపంచస్థాయి వ్యాపారసంస్థలు తమ భారత కార్యాలయాలను గురుగావ్ లోనే ఏర్పాటు చేసుకున్నాయి. ఇంతకూ ఎవరి వాదన సరైనది? పేరు మార్పు  మద్దతుదార్లదా, లేక దాన్ని వ్యతిరేకించేవారిదా?

మన దేశంలో నగరాల పేర్లను మార్చడం, 20 ఏళ్ల క్రితం బీజేపీ-శివసేన ప్రభుత్వం బొంబాయి పేరును మార్చడంతో మొదలైంది. అయితే అది గురుగ్రామ్ కంటే భిన్నమైనది. తాము ఏ భాషలో మాట్లాడుతామనే దాన్ని బట్టి దాన్ని బొంబాయి, ముంబై అనేగాక బుంబై అని కూడా చాలా మంది పిలుస్తుండేవారు. ఆ పేరు మార్పుకు వ్యతిరేకులు కూడా బొంబాయి బ్రాండు ప్రతిష్ట దెబ్బ తింటుందనే ఇదే వాదనను అప్పట్లో వాడారు. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే, 20 ఏళ్లలో మొత్తంగా ఒక తరం తిరిగే సరికి పేరు మార్పువల్ల బొంబాయి బ్రాండ్ ఇమేజ్ ఏమీ దెబ్బతిన్నట్టు అనిపించదు. ముంబై సమస్యలు వ్యవస్థాగతమైనవి.

బయటి నుంచి వచ్చేవారికి ఆ నగరం ఉద్యో గావకాశాలను కల్పిస్తుంది. కానీ వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా ఉంటాయి. అక్కడి కొన్ని మంచి పరిసరాల్లోని ఆస్తి విలువ న్యూయార్క్ లేదా లండన్ నగరాల్లో కంటే ఎక్కువ. దీంతో ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా కుటుం బం ఆ నగరంలో సౌకర్యంగా బతకడం కష్టం. ఇక ప్రజా రవాణా మూడో ప్రపంచ దేశాల స్థాయిది. నిత్యమూ దాదాపు 10 మంది లోకల్ రైలు ట్రాక్‌ల మధ్య మరణిస్తుంటారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారెవరైనా వెనక్కు తగ్గితే ఇలాంటి కారణాల వల్లనే తప్ప, కొత్త పేర్ల వల్ల కాదు.

ముంబై పేరు మార్పు వెంబడి మద్రాసు పేరును మార్చారు. చెన్నైగా మారిన మద్రాసు 1990లకు ముందెన్నడూ ఆ పేరు విని ఎరుగని తమిళేతరు లను  ఆశ్చర్యంలో ముంచెత్తింది. మద్రాసు, బ్రిటిష్‌వారు నిర్మించిన నగరం. భారతదేశంలోని వారి మొట్టమొదటి కోట ఫోర్ట్ సెయింట్ జార్జి చుట్టూ అది అభివృద్ధి చెందింది. నేడక్కడ తమిళనాడు శాసన సభ ఉంది.

ఇక ఆ తర్వాత కమ్యూనిస్టులు కలకత్తా పేరును మార్చారు. ఆ నగరం పేరును కూడా ఎప్పుడూ మూడు రకాలుగా పలుకుతుండేవారు. బెంగాలీలో మాట్లాడుతుంటే కొల్‌కత్తా అని, ఇంగ్లిషులో అయితే కల్‌కటా అని, హిందీ లేదా గుజరాతీలలో కాల్‌కత్తా అని పిలిచేవారు. ‘‘బంగొలూరు’’ విషయం లోలాగే కొత్త పేరుతో పరిచయం లేనివారు ఇంగ్లిషు స్పెల్లింగ్‌లోని ‘ఏ’ ని ‘ఓ’ గా మార్చి కొల్‌కొత్తాగా మార్చారు.

కమ్యూనిస్టుల హయాంలో. కోల్‌కతా కూడా నగరంలోని ఒక రోడ్డు పేరును ప్రత్యేకించి మార్చింది. హారింగ్‌టన్ వీధి హో చి మిన్ సరానిగా మారింది. ఈ పేరు మార్పునకు కారణం, అమెరికన్ కాన్స్‌లేట్ ఆ రోడ్డులో ఉండటమే. అది అమెరికన్లకేమీ ఇబ్బంది కలిగించి ఉంటుందనుకోను. కాక పోతే అది పరిణతితో కూడిన చర్య కాదు. ధిక్కారాన్ని అలాంటి పద్ధతుల్లో వ్యక్తం చేయడం సాహసోపేతమైనదిగానీ లేదా తెలివైనదిగానీ కాదు.

ఇక తిరిగి పేర్లను పలకడానికి సంబంధించిన విషయానికి వద్దాం. పేర్ల మార్పునకు మద్దతుదారులు... దాన్ని విదేశీ విలువల తిరస్కరణగా, స్థానిక గుర్తింపునకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంగా చూపుతున్నారు. అయితే ఇతర భారతీ యులు ఆ ప్రదేశం పేరును ఎలాబడితే అలా వికృత పరుస్తుండటం ఈ వాదనను మసకబారుస్తోంది.

గుజరాత్ మొట్టమొదటి ముస్లిం రాజ్య పాలకుడు అహ్మద్ ఆరు వందల ఏళ్ల క్రితం నిర్మించిన అహ్మదాబాద్ నగరం పేరును మార్చాలని బీజేపీ చాలా కాలంగా భావిస్తోంది. సోలాంకి వంశపు రాజైన క ర్ణుని పేరిట ఆ నగరాన్ని కర్ణావతిగా పిలవాలని బీజేపీ కోరుకుంటోంది. అయితే గుజరాతీలంతా ఆ నగరాన్ని ‘‘అమ్దాబాద్’’గా పరిగణిస్తారు. కాబట్టి, ఇప్పటికే దాని  పేరు మార్పు అనధికారికంగా జరిగిపోయింది. రాష్ట్రేతరులు మాత్రమే దాన్ని అహ్మ దాబాద్ అని పిలుస్తారు.

చాలా మందికి ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ, ఈ పేర్ల మార్పు వల్ల పెద్ద నష్టమేమీ వాటిల్లినట్టు అనిపించదు. అలా అని దాని వల్ల కలిగిన మేలూ లేదు. కాకపోతే ఈ పేరు మార్పు జ్వరం ఎందుకిలా పట్టుకుందనేదే ప్రశ్న. 20 ఏళ్లుగా ఉన్న ఈ జ్వరం ఇంకా మండిపోతూనే ఉండటానికి కారణమేమిటనేది సుస్పష్టమే. మన రాజకీయపార్టీలు కొద్ది రోజులపాటూ వార్తల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవడానికి అది తేలిక మార్గం. ఆ పేరు మార్పు వల్ల కలిగే ఫలితం కేవలం సంకేతాత్మకమైనదే అయినా, మీడియా అలాంటి వాటి పట్ల ఆసక్తిని చూపుతుంది.

అయితే, అధ్వానంగా రూపకల్పన చేసి, అధ్వానంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రాంతాలను స్మార్ట్ నగరాలుగా పరివర్తన చెందిం చేదే నిజమైన మార్పు. అది చేయడమే చాలా కష్టం. ఆ పని చేయడానికి సరిపడే వనరులు మనకు లేవు. పైగా, పేదరికం, నిరక్షరాస్యత, హింస, ప్రజా రోగ్యం, ఆకలి అనే నిజమైన సమస్యలతో సతమతమౌతున్న మన దేశం లాంటి దేశాలున్న ప్రాంతంలో అది ప్రాధాన్యం కలిగిన అంశం కూడా కాదు. మెరుగైన నగరాలు మన ప్రాధాన్యం కాలేవు. నిజమైన మార్పు సాధ్యం కాదు కాబట్టి, పేరు మార్పుతోనైనా సంతృప్తి చెందాలి.
 


ఆకార్ పటేల్,
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు