ప్రధాని మోదీపై పోటీకి సై

26 Apr, 2019 03:12 IST|Sakshi

వారణాసి తరలివెళ్లిన పసుపు రైతులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు సుమారు 25 మంది పసు పు రైతులు గురువారం వారణాసికి తరలివెళ్లారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఈ రైతులు ఆర్మూర్‌ నుంచి నాగ్‌పూర్‌కు బస్సులో బయలుదేరారు. అక్కడి నుంచి రైలులో శుక్రవారం వారణాసి చేరుకుంటారు. శనివా రం తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు.

పసుపుబోర్డు ఏర్పాటుతోపాటు పంట కు మద్దతు ధర కల్పించాలనే తమ డిమాండ్‌ను దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా ఇటీవల నిజామాబా ద్‌ నుంచి పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఇప్పు డు ప్రధానిపైనే పోటీ చేయడం ద్వారా తమ డిమాం డ్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని వారు భావిస్తున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌ బరిలోకి దిగుతున్న వయనాడ్‌ నుంచి నామినేషన్లు వేయాలని భావించినా వీలు పడలేదని రైతులు పేర్కొన్నారు. 

స్థానిక రైతు సంఘాల సహకారంతో.. 
స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలంటే సంబంధిత నియోజకవర్గంలో 10 మంది ఓటర్లు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఇక్కడి రైతులు వారణాసిలోని కొన్ని స్వతంత్ర రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపారు. వీరి సహకారంతో నామినేషన్లు వేస్తామని పసుపు రైతు సంఘం రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు పేర్కొన్నారు. 

ఈరోడ్‌ పసుపు రైతుల మద్దతు 
నిజామాబాద్‌ జిల్లా పసుపు రైతులకు పసుపు సాగు చేసే తమిళనాడులోని ఈరోడ్‌ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు కూడా మద్దతు పలికారు. ఈరోడ్‌ పసుపు రైతులు కూడా వారణాసిలో నామినేషన్లు దాఖలు చేస్తారని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆల్‌ ఇండియా పసుపు రైతుల సంఘం అధ్యక్షులు పి.కె.వైవశిఖామణి తమకు మద్దతు పలికారని నర్సింహనాయుడు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు