‘శివసేన తీరుతోనే కూటమిలో చిచ్చు’

13 Nov, 2019 19:32 IST|Sakshi

ముంబై : శివసేన కొత్త డిమాండ్లకు తాము తలొగ్గనందునే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా స్పష్టం చేశారు. సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన ప్రతిపాదనను తాము ఆమోదించలేదని చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వస్తే మహారాష్ట్ర తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాను కూడా బహిరంగంగా ప్రకటించామని అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని శివసేన తర్వాత కొత్త డిమాండ్‌తో ముందుకువచ్చిందని ఆరోపించారు.

శివసేన డిమాండ్‌ తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దిశగా కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) రూపకల్పనపై పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పృధ్వీరాజ్‌ చవాన్‌ వెల్లడించారు. ముసాయిదా సీఎంపీని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలు ఆమోదించిన తర్వాత ఈ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు.

మరిన్ని వార్తలు