ప్రపంచం ముగిసిపోయిందనుకున్నా: కోహ్లి

13 Nov, 2019 19:38 IST|Sakshi

ఇండోర్‌ : ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున క్రికెట్‌కు విరామం ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌ నిర్ణయం అసాధారనమైదని ప్రశంసించాడు. అలా చెప్పడానికి, విరామం నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని కోహ్లి పేర్కొన్నాడు.  2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో తాను కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఆ సిరీస్‌లో ఒక్క అర్దసెంచరీ సాధించలేదని, దీంతో ఆటగాడిగా చాలా కృంగిపోయినట్లు.. అంతేకాకుండా ఇక ప్రపంచం ముగిసిపోయిందని అనుకునే వాడినని  తెలిపాడు. అలాంటి గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టినట్లు తెలిపాడు. 

‘ఏ ఒక్కరూ కూడా తన వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించడానికి ఇష్టపడరు. కానీ మ్యాక్స్‌వెల్‌ తను ఎదుర్కొంటున్న సమస్యను బాహ్యప్రపంచానికి తెలిపాడు. మ్యాక్స్‌ చేసింది అసాధారణం. నేను కూడా ఇక ప్రపంచం ముగిసిపోయందనుకున్న సందర్బాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాలేదు. అందరూ ఎవరి పనిలో వారు నిమజ్ఞమైపోతుంటారు. అయితే ఎదుటివారి మనసులో ఏముంటదో అర్థం చేసుకోలేరు. మన మనసు సరిగా లేనప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ విషయంలో మ్యాక్స్‌వెల్‌ ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలిచాడు. అయితే ఇలాంటి ధైర్యం నేను చేయలేను. అయితే కెరీర్‌లో ఇబ్బందులు వచ్చినప్పుడు స్పష్టత కోసం విరామం తీసుకోవడం మంచిదే. అయితే ఇలాంటి నిర్ణయాలను గౌరవించాలి కానీ వ్యతిరేకించవద్దు. మ్యాక్స్‌వెల్‌ నిర్ణయాన్ని స్వాగతించాలి, గౌరవించాలి’అని కోహ్లి పేర్కొన్నాడు. 

చదవండి: 
మానసిక సమస్యలు.. బ్రేక్‌ తీసుకుంటున్నా

మరిన్ని వార్తలు