సాక్షి, హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ.. గత ఆరేళ్లలో దగాకు గురయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. అబద్ధాలు, మోసాలతో కాలం గడుపుతున్నారని, అమరుల ఆకాంక్ష నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, రైతుబంధు ఎగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్ కొత్తకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూసార పరీక్షలు చేయకుండా, ఆయనకు ఇష్టమొచ్చిన పంటలు వేయమంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ప్రజలందరూ బీజేపీకి అండగా ఉన్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. (‘తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులకు నమస్కారం’)