ఉగ్రదాడితో రాజకీయ లబ్ధికి బీజేపీ వ్యూహం

21 Feb, 2019 03:06 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి. చిత్రంలో తమ్మినేని

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ఉగ్రదాడిని రాజకీయంగా ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఇది విద్రోహ చర్యేనని, యావద్దేశం ఈ దాడి విషయంలో ఐక్యంగా నిలిస్తే బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో సైనికులు చనిపోయారని అయినా తమది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం ఏమి సాధించిందని, ఈ దాడి కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా అని ఆయన నిలదీశారు. పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చే ప్రయత్నం అత్యంత ప్రమాదకరమని, అందుకే దానిని వ్యతిరేకించామన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వహయాంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్‌’రక్షణ ఒప్పందం రూపంలో బయటపడిందన్నారు.

బీజేపీ ఓటమే లక్ష్యం...
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని ఏచూరి చెప్పారు. ప్రధాని మోదీని ఓడించి దేశాన్ని కాపాడాలని, పశ్చిమబెంగాల్‌లో అక్కడి సీఎం మమతాబెనర్జీని ఓడించి బెంగాల్‌ను పరిరక్షించాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేయడంపై సీపీఐతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీతో నేరుగా పొత్తు ఉండదన్నారు. అయితే తమిళనాడులో డీఎంకేతో తమకు పొత్తు ఉండగా, ఆ పార్టీతో కాంగ్రెస్‌ కూడా కలసి పనిచేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లు చూస్తుంటామన్నారు. అప్పట్లో హడావుడి చేసిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

బీఎల్‌ఎఫ్‌ కొనసాగింపు: తమ్మినేని
లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎల్‌ఎఫ్‌ ప్రయోగం కొనసాగించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.ఈ ఎన్నికల్లో కలసి పోటీచేసే విషయంలో సీపీఐ కార్యదర్శిచాడ వెంకట్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో టీజేఎస్, జనసేనతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. సీపీఎం పక్షంగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తమ్మినేని ఓ ప్రశ్నకు బదులిచ్చా రు. టెన్‌ టీవీని విరాళాలు తీసుకుని ఏర్పాటు చేశామని, నష్టాలు రావడంతో విరాళాలు వెనక్కు ఇస్తున్నామన్నారు. పొలిట్‌బ్యూరో అనుమతి తీసుకున్నాకే నష్టాల్లో ఉన్న సంస్థను విక్రయించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు