నా ఇంటినీ కూల్చేస్తే?

27 Jun, 2019 04:42 IST|Sakshi
ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు మంతనాలు

ప్రజావేదిక కూల్చివేతపై ఎక్కువగా స్పందించకపోవడమే మంచిదన్న నేతలు

గౌరవప్రదంగా వేరే ఇంటికి వెళ్లిపోతే మంచిదని నేతల అభిప్రాయం

సాక్షి, అమరావతి: కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టిన నేపథ్యంలో ఆ పక్కనే తాను నివాసం ఉంటున్న భవనాన్ని కూడా కూల్చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం టీడీపీ నాయకులతో సమావేశమైన ఆయన ప్రజావేదిక కూల్చివేత, తదనంతర పరిణామాలపై చర్చించారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందని పలువురు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ భవనానికి సంబంధించిన అనుమతుల వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినంత సులభంగా దీని వద్దకు రాలేదని కొందరు నేతలు పేర్కొన్నారు. కొందరు నేతలు మాత్రం అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసేలా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న ఇంటి విషయంలో విజ్ఞతతో వ్యవహరించాలని పలువురు మంత్రులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు సూచించడంపైనా చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేయకుండా గౌరవప్రదంగా వేరే ఇంటికి మారిపోతే బాగుంటుందని కొందరు నాయకులు అభిప్రాయపడగా అలా చేస్తే చంద్రబాబు తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లవుతుందని మరికొందరు అన్నట్లు తెలిసింది. చివరికి చంద్రబాబు ఇల్లు మారిపోతేనే మంచిదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ప్రజావేదికను ప్రభుత్వం కక్షపూరితంగానే కూల్చివేసిందని ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అయితే అదే సమయంలో దీనిపై ఎక్కువగా స్పందించరాదని, లేదంటే అక్రమ కట్టడాల కూల్చివేతను వ్యతిరేకించినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమవడం, పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని జరుగుతున్న ప్రచారంపైనా చంద్రబాబు చర్చించారు.

మరిన్ని వార్తలు