ఒకవేళ కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉంటే..

12 Aug, 2019 17:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవేళ జమ్మూకశ్మీర్‌లో హిందూ ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండి ఉంటే..  బీజేపీ ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని ఎప్పటికీ రద్దు చేసి ఉండేది కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్‌ ఈ రోజు ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఆర్టికల్‌ 371 కింద ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఒక్క జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఎందుకు తొలగించారు. ఎందుకంటే ఇది మతమౌఢ్యం కాబట్టి’ అని చిదంబరం బీజేపీపై ధ్వజమెత్తారు.

జమ్మూకశ్మీర్‌లో ముస్లిం ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఒకవేళ అక్కడ హిందువుల ఆధిక్యత ఉండి ఉంటే బీజేపీ ఈ నిర్ణయం తీసుకోనేది కాదని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చిదంబరం వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, కేంద్రం నిర్ణయానికి కాంగ్రెస్‌ మత కోణాన్ని ఆపాదిస్తోందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. దశాబ్దాల కింద కాంగ్రెస్‌ చేసిన చరిత్రాక తప్పిదాన్ని బీజేపీ ప్రభుత్వం సరిచేసిందని మరో కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు