న్యాయ పోరాటం 

16 Mar, 2018 03:04 IST|Sakshi

‘బహిష్కరణ’పై హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్‌ పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతోపాటు, నల్లగొండ, అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ న్యాయ పోరాటం ప్రారంభించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును నిలిపేయడంతోపాటు, ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నల్లగొండ, అలంపూర్‌ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి చైర్మన్‌పై హెడ్‌ సెట్‌ విసిరేసి ఆయనను గాయపరిచామని చెప్పి తమ శాసన సభ్యత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. 

న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తమ బహిష్కరణ, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోర్టును కోరారు. గురువారం ఈ వ్యాజ్యం గురించి కోమటిరెడ్డి, సంపత్‌ తరఫు న్యాయ వాది.. న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ముందు ప్రస్తావించారు. దీనిపై విచారణ జరపాలని అభ్యర్థించారు. స్పందించిన జడ్జీ శుక్రవారం విచారణ జరుపుతామన్నారు. 

వ్యక్తిగత పగకు బాధితులయ్యాం 
‘అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మేం సీఎం, ఆయన సహచరుల వ్యక్తిగత పగకు బాధితులుగా మారాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పదే పదే ప్రశ్నిస్తున్న మమ్మల్ని భవిష్యత్తులో శాసనసభలో అడుగుపెట్టనివ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ 13న శాసన సభా వ్యవహారాల మంత్రి మా ఇద్దరినీ సభ నుంచి బహిష్కరిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగా మా నియోజకవర్గాలైన నల్లగొండ, అలంపూర్‌లు ఖాళీ అయినట్లు పేర్కొంటూ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

రాజ్యాంగంలోని అధికరణలు 175, 176 ప్రకారం సభా సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ ప్రసంగానికి ముందూ, తర్వాతా ప్రతీ సభ్యుడు సభ హుందాతనాన్ని కాపాడాల్సి ఉంటుంది. అలాగే గవర్నర్‌ ప్రసంగానికి ఏ రకంగానూ అంతరాయం కలిగించడానికి వీల్లేదు. అయితే రాజ్యాంగ నిబంధనలు, శాసనసభ నిర్వహణ నిబంధనల్లో గవర్నర్‌ ప్రసంగానికి అంత రాయం కలిగించిన సభ్యుడిని సస్పెండ్‌ చేయవచ్చని ఎక్కడా లేదు. సభాపతి స్థానాన్నిగానీ, సభనుగానీ కించపరిచినప్పడు, సభా వ్యవహారాలను నిరాటంకంగా అడ్డుకున్నప్పుడు స్పీకర్‌ సంబంధిత సభ్యుడిని సస్పెండ్‌ చేయవచ్చు. అది కూడా ఓ సెషన్‌కు మాత్రమే పరిమితం. కానీ తమను గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగించామంటూ బహిష్కరించారు’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

సభా వ్యవహారాల కిందికి రాదు..
‘గవర్నర్‌ ప్రసంగానికీ, సభా వ్యవహారాలకు సంబంధమే లేదు. సభా వ్యవహారాలపై పలువురు నిపుణులు రాసిన పుస్తకాలను బట్టి ముఖ్యంగా సుభాష్‌ సి.కశ్యప్‌ రాసిన పార్లమెంటరీ ప్రొసీజర్, థర్డ్‌ ఎడిషన్‌ను పరిశీలిస్తే, రాష్ట్రపతి, గవర్నర్‌ ప్రసంగాలు సభా వ్యవహారాల పరిధిలోకి రావు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో సభకు గవర్నరే నేతృత్వం వహిస్తారు. అప్పుడు జరిగేవి సభా వ్యవహారాలు కాదు. వాటి విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోజాలరు. 

గవర్నర్‌ ప్రసంగ సమయంలో మిగిలిన పార్టీలు కూడా వాకౌట్‌ చేశాయి. ఇది కూడా సభ హుందాతనానికి విరుద్ధంగా వ్యవహరించడమే. వారు చేసింది తప్పు కానప్పుడు మేం చేసింది ఎలా తప్పు అవుతుంది? చట్టాలు చేసే సభలోనే సమానత్వం లేదన్న విషయం రుజువైంది. అందువల్ల మమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులు చట్ట ప్రకారం చెల్లుబాటు కావు. కాబట్టి ఆ ఉత్తర్వులను రద్దు చేయండి’అని కోర్టును కోరారు. 

>
మరిన్ని వార్తలు