కశ్మీరీలపై దాడి: మోదీ తీవ్ర ఆగ్రహం​

8 Mar, 2019 17:31 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కశ్మీరీ యువకులపై విశ్వహిందూ దళ్‌ (వీహెచ్‌డీ)కి చెందిన సభ్యులు దాడికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని, ఇలాంటి దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ ఆదేశించారు. డాలీగంజ్‌ ప్రాంతంలో డ్రై ఫ్రూట్స్‌ అమ్ముకుంటున్న ఇద్దరు కశ్మీరీ యువకులపై రెండు రోజుల క్రితం కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. 

ఘటనపై యూపీ పోలీసులు ధర్యాప్తు చేయగా వారిలో ఒకరు విశ్వ హిందూ దళ్‌ అధ్యక్షుడిగా తేలింది. కశ్మీరీ యువకులపై వీహెచ్‌డీ దాడిచేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మోదీ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఘటన గురించి ఆరా తీసి.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా పూల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల అనంతరం దేశ వ్యాప్తంగా కశ్మీరీ యువకులపై హిందూ సంఘాలు దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

మరిన్ని వార్తలు