కుటుంబీకులపై శశికళ అసహనం

9 Feb, 2018 08:35 IST|Sakshi
శశికళ (ఫైల్‌ ఫోటో)

ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని చిన్నమ్మ క్లాస్‌

సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్‌కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్‌ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్‌కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.

కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది.

మరిన్ని వార్తలు