ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌ రాజీనామా

5 Jun, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్‌ నల్గొండ ఎంపీగా గెలుపొందారు. దీంతో ఉత్తమ్‌ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఎంపీగా ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని.. కుటుంబ సభ్యులలో ఒకరిగా ఎంతో ప్రేమగా చూసుకున్నారని పేర్కొన్నారు. వారి అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎంపీగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఎంపీగా ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో 5 నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. తన ప్రాణం ఉన్నంతకాలం ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు.

కాగా, ఉత్తమ్‌ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లలో కోదాడ నుంచి, 2009, 2014, 2018లలో హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌గా, ఎస్టిమేషన్‌ కమిటీ చైర్మన్‌గా, 610 జీవో హౌస్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు