కోహ్లీ లేకున్నా భారత్‌కు నష్టం లేదు: స్టీవ్ స్మిత్

24 Mar, 2017 19:24 IST|Sakshi
కోహ్లీ లేకున్నా భారత్‌కు నష్టం లేదు: స్టీవ్ స్మిత్

ధర్మశాల: రాంచీ టెస్టులో గాయపడిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి టార్గెట్ చేసుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమై, టెస్ట్ కెరీర్‌లోనే తక్కువ సగటుకు పడిపోయాడు కోహ్లీ. డీఆర్ఎస్ వివాదంపై తనపై తీవ్ర విమర్శలు చేసిన కోహ్లీపై, అతడి కెప్టెన్సీపై స్మిత్ వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీలో విరాట్ కంటే వైస్ కెప్టెన్ రహానేనే బెస్ట్ అన్నాడు. మూడో టెస్ట్ రాంచీలో కోహ్లీ గాయపడ్డ సమయంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ రహానే ఎంతో తెలివిగా వ్యవహరించడం తాను గమనించినట్లు చెప్పాడు.

'గాయపడ్డ కోహ్లీ నాలుగో టెస్టులో ఒకవేళ ఆడకపోయినా.. భారత్‌కు జరిగే నష్టమేం లేదని బెస్ట్ కెప్టెన్ రహానే చేతిలో జట్టు ఉంటుంది. అతడు కోహ్లీలా ఉద్వేగానికి లోనవకుండా, గేమ్‌ను అర్థం చేసుకునేందుకు యత్నిస్తాడు. సిరీస్‌లో 1-1 తో సమ ఉజ్జీగా ఉన్నాం. ధర్మశాలలో ఫలితం ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్ ఫలితం ఎలా వచ్చినా అంగీకరించేందుకు జట్టు సిద్ధం. భారత్‌ను వారి గడ్డపై ఓడించడం చాలా కష్టం. ఏది ఏమైతేనేం ఈ సమ్మర్‌లో మంచి క్రికెట్‌ను ఆడినందుకు హ్యాపీగా ఉన్నాను. కోహ్లీ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ చక్కగా భర్తీ చేయగలడు' అని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. రహానే, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు శనివారం నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది. మరోవైపు తాను పూర్తిగా ఫిట్గా ఉంటేనే బరిలోకి దిగుతానని విరాట్ తాజాగా స్పష్టం చేశాడు. ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ తో ఫిట్నెస్ పై చర్చించిన తరువాత శుక్రవారం రాత్రి, శనివారం మార్నింగ్ గానీ కోహ్లీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు