15 ఏళ్ల చిన్నోడు.. భారత్‌కు స్వర్ణం తెచ్చాడు..

13 Apr, 2018 10:44 IST|Sakshi
భారత షూటర్‌ అనీష్‌ భన్వాలా

గోల్డ్‌ కోస్ట్‌, క్వీన్స్‌లాండ్‌ : భారత షూటర​అనీష్‌ భన్వాలా చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో(భారత్‌ నుంచి) బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 25 మీటర్ల రాపిడ్‌ పిస్టల్‌ విభాగంలో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అనీష్‌ తన కంటే ఎన్నో ఏళ్ల అనుభవం గల ప్రపంచస్థాయి సీనియర్లను వెనక్కునెట్టాడు.

ఓ దశలో ఆస్ట్రేలియాకు చెందిన షూటర్‌ సెర్గి ఎవ్‌గ్లెవ్‌స్కీ(2014 కామన్‌వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌) అనీష్‌ను వెనక్కు నెట్టాడు. ఆత్మవిశ్వాసం కోల్పోని అనీష్‌ ఆఖరి రెండు రౌండ్లలో సెర్గి కన్నా రెండేసి ఎక్కువ పాయింట్లు సాధించి పసిడి పట్టాడు. అన్ని రౌండ్లలో కలిపి అనీష్‌ 30 పాయింట్లు సాధించగా.. సెర్గి 28 పాయింట్లతో రెండో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన శామ్‌ 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

25 మీటర్ల రాపిడ్‌ పిస్టల్‌ ఈవెంట్లో 30 పాయింట్లు సాధించడం కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇదే తొలిసారి కూడా. షూటింగ్‌లో జూనియర్‌ వరల్డ్‌ రికార్డు అనీష్‌ పేరిటే ఉంది. గత షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో సైతం అనీష్‌ స్వర్ణం సాధించాడు. భారత్‌ తరఫున 15 ఏళ్ల వయసులో అభినవ్‌ బింద్రా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అయితే పతకం సాధించలేకపోయాడు.

మరిన్ని వార్తలు