భారత జట్లకు తొలి ఓటమి

10 Sep, 2016 03:03 IST|Sakshi
భారత జట్లకు తొలి ఓటమి

బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు తొలి పరాజయం ఎదురైంది. ఏడో రౌండ్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 0.5-3.5తో ఓడిపోగా... మహిళల జట్టు 1.5-2.5తో అజర్‌బైజాన్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో ఫాబియానో కరువానాతో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 46 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నకముర చేతిలో ఆధిబన్, సో వెస్లీ చేతిలో విదిత్, శంక్‌లాండ్ చేతిలో సేతురామన్ ఓడిపోయారు. మహిళల విభాగంలో జైనబ్‌తో జరిగిన గేమ్‌ను హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... సౌమ్య స్వామినాథన్ 63 ఎత్తుల్లో అయ్‌దాన్‌పై గెలిచింది. పద్మిని రౌత్ 59 ఎత్తుల్లో గునెయ్ చేతిలో, తానియా 36 ఎత్తుల్లో గుల్నార్ చేతిలో ఓటమి చవిచూశారు. 

మరిన్ని వార్తలు