'ధోని 2023 ప్రపంచ కప్ కూడా ఆడతాడు'

20 Sep, 2017 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మరోసారి ప్రశంసల జల్లులు కురిపించారు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేతో కెరీర్‌లో 300వ మ్యాచ్‌ ఆడిన ధోనిని 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అని పేర్కొన్న క్లార్క్‌.. దిగ్గజ ఆటగాడైన ధోని కచ్చితంగా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులోనే కాదు 2023లో జరిగే వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడిగా ఉంటాడంటూ జోస్యం చెప్పారు. ఇందుకు మిస్టర్ కూల్ ధోని ఫిల్‌నెస్ లెవల్స్ కారణమని క్లార్క్ చెప్పారు. ధోని ప్రతిభ, ఆటతీరుపై తనకేమాత్రం సందేహం లేదన్నారు.

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేతోనూ సిరీస్ ఫలితం తేలిపోతుందని క్లార్క్ భావిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ ధోని అద్భుత ఆటతీరుతో రాణించి లంకపై 5-0తో టీమిండియాను గెలిపించాడన్నారు. లంకతో వన్డే సిరీస్ ఫలితమే ధోని నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వచ్చే వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటాడో లేదోనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని రాణించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83) సాయంతో ధోని (88 బంతుల్లో 79) ముందుకు నడిపించి తొలి వన్డే నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడని ఆసీస్ మాజీ దిగ్గజం మైఖెల్ క్లార్క్ కొనియాడాడు. 

మరిన్ని వార్తలు