న్యూఢిల్లీ: క్రీడల్లో మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ను నియంత్రించే విషయంలో తగిన సూచనల కోసం కేంద్ర క్రీడా శాఖ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సహాయాన్ని కోరింది. ఫిక్సింగ్ వ్యతిరేక చట్టాన్ని తెచ్చే క్రమంలో ఉన్న క్రీడా శాఖ... దీనిపై పరిజ్ఞానాన్ని పంచుకోవాలంటూ ఐఓసీ డెరైక్టర్ జనరల్ క్రిస్టఫ్ డి కెప్పెర్కు లేఖ రాసింది.
ఐపీఎల్లో ఇలాంటి తరహా ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ చట్టం అమలుపై డిమాండ్ వినిపించింది. ‘ఒకవేళ ఐఓసీ తమ వినతిని అంగీకరిస్తే సంతోషిస్తాం. వారి సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి’ అని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.