'అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు'

9 Jan, 2018 14:37 IST|Sakshi

కొలంబో:శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్‌ను తిరిగి ఎంపిక చేశారు. ఈ మేరకు  మాథ్యూస్‌ను 2019 వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ సారథిగా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) మంగళవారం ప్రకటించింది. గతేడాది జూలై నెలలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి గుడ్‌ బై చెప్పిన మాథ్యూస్‌ను మళ్లీ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.అయితే దీనిపై స్పందించిన మాథ్యూస్‌..' గతంలో సారథిగా తప్పుకున్నప్పుడే ఇక ఎప్పుడూ ఆ బాధ్యతల్ని మీద వేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే ఎస్‌ఎల్‌సీ, ప్రధాన కోచ్‌, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబట్టారు. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నా.

వచ్చే వరల్డ్‌ కప్‌కు  సమతుకంతో కూడిన జట్టును తయారు చేయాల్సి ఉంది. ఆ మెగా ఈవెంట్‌కు 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నేను తిరిగి కెప్టెన్సీ చేపట్టడంలో మెంటర్‌ చందికా హతురసింఘా పాత్ర కీలకం. అతని ప్రేరణతోనే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించా'అని మాథ్యూస్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు