ఆమ్లా సరసన ఎల్గర్‌

4 Oct, 2019 13:19 IST|Sakshi

విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ సెంచరీ సాధించాడు. 175 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్కును చేరాడు. దక్షిణాఫ్రికా కష్టాల్లో పడ్డ సమయంలో ఎల్గర్‌ సమయోచితంగా ఆడి శతకంతో ఆదుకున్నాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఎల్గర్‌ మాత్రం చెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ క్రమంలోనే ముందుగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్‌.. ఆపై సెంచరీ సాధించాడు.  ఇది ఎల్గర్‌కు 12వ టెస్టు సెంచరీ. కాగా ఆసియా ఖండంలో రెండో సెంచరీ. భారత్‌లో మాత్రం ఎల్గర్‌ ఇదే తొలి సెంచరీ. అయితే 2010లో భారత్‌లో దక్షిణాఫ్రికా తరఫున హషీమ్‌ ఆమ్లా టెస్టు సెంచరీ సాధించిన ఇంతకాలానికి ఆ దేశ బ్యాట్స్‌మన్‌ ఇక్కడ సెంచరీ చేయడం విశేషం. తొమ్మిదేళ్ల తర్వాత ఎల్గర్‌ ఆ ఫీట్‌ను సాధించి ఆమ్లా సరసన చేరాడు.

39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా  వికెట్‌ను చేజార్చుకుంది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో బావుమా ఎల్బీగా ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్‌ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్‌-డుప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ముందుగా ఎల్గర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, లంచ్‌ తర్వాత డుప్లెసిస్‌ సైతం అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ 115 పరుగులు జోడించిన తర్వాత డుప్లెసిస్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో లెగ్‌ గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న పుజారాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

మరిన్ని వార్తలు