భారత జట్టులో ఆ ఇద్దరూ అవసరం లేదు..

29 Sep, 2019 10:49 IST|Sakshi

కోల్‌కతా:  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా పటిష్టంగా ఉండాలంటే మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లను తిరిగి ఎంపిక చేయాలని మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో చహల్‌ను పక్కకు పెట్టినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో అతని అవసరం చాలా ఉందన్నాడు. వచ్చే ఏడాది వరల్డ్‌ టీ20 జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు ఎంతో ముఖ్యమన్నాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందన్నాడు. 

కాగా, వరల్డ్‌ టీ20 ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం గంగూలీ సమాధానం చెప్పలేదు. కాకపోతే ఆ మెగా టోర్నీలో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. ఆ వరల్డ్‌కప్‌ కోహ్లి చాలా ముఖ్యమైనదని గంగూలీ తెలిపాడు. అదే సమయంలో భారత జట్టు ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా)లు అవసరం లేదన్నాడు. వీరిలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందన్నాడు. ఆ ఇద్దర్నీ ఒకే మ్యాచ్‌ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలన్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత్‌ రాణిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు