ఆసీస్‌ చేతిలో పోరాడి ఓడిన భారత్‌

28 Jun, 2018 04:38 IST|Sakshi

బ్రెడా (నెదర్లాండ్స్‌): చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జోరుకు బ్రేక్‌ పడింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–3 గోల్స్‌ తేడాతో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. అయితే ఆసీస్‌ పైచేయి సాధించడంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి తప్పలేదు. టీమిండియా తరఫున వరుణ్‌ కుమార్‌ (10వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (58వ ని.) చెరో గోల్‌ చేశారు. ఆస్ట్రేలియా జట్టులో లచ్‌లాన్‌ షార్ప్‌ (6వ ని.), టామ్‌ క్రెయిగ్‌ (15వ ని.), ట్రెంట్‌ మిటన్‌ (33వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. నేడు జరిగే పోరులో బెల్జియంతో భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

మరిన్ని వార్తలు