‘అక్తర్‌ సూచన మరీ కామెడీగా ఉంది’

10 Apr, 2020 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నిర్వహించడమే కష్టంగా ఉన్న సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ సిరీస్‌ ఎలా సాధ్యమవుతుందని ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా ప్రశ్నించారు. కరోనాపై పోరాటంలో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించాలని పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సూచించిన విషయం తెలిసిందే. అయితే అక్తర్‌ సూచనపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అక్తర్‌ వ్యాఖ్యలపై ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా స్పందించారు. 

‘అక్తర్‌ చాలా సరదా మనిషి అని అందరికీ తెలుసు. సమయానికనుగుణంగా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుంటాడు. అయితే కరోనా విరాళాల కోసం భారత్‌-పాకిస్తాన్‌ సిరీస్‌ నిర్వహిస్తే రెండు దేశాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని సలహా ఇచ్చారు. అయితే అక్తర్‌ సూచన చాలా సరదాగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించడం(అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా) సాధ్యపడటం లేదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేనటువంటి ఇలాంటి సమయంలో మూడు వన్డేల సిరీస్‌ ఎలా సాధ్యపడుతుంది. మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి, ఒకదేశం ఆటగాళ్లను మరో దేశంలోకి ఎలా అనుమతిస్తారు? అందుకే అక్తర్‌ వ్యాఖ్యలు కామెడీగా అనిపించాయి’అని రాజీవ్‌ శుక్లా పేర్కొన్నాడు. 

చదవండి:
భారత్‌ సాయం కోరిన అక్తర్‌
ఐపీఎల్‌ నష్టం రూ.3800 కోట్లు! 

>
మరిన్ని వార్తలు