టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

25 Jul, 2019 15:46 IST|Sakshi

ముంబై:  టీమిండియా ఆటగాళ్లు ధరించే బ్లూ జెర్సీపై ఇంతకాలం కనిపించిన మొబైల్ సంస్థ ఒప్పో బ్రాండ్ త్వరలో కనుమరుగవనుంది. ఒప్పో బ్రాండ్‌కు బదులు కొత్త బ్రాండ్‌ స్వదేశీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ బ్రాండ్‌ కనిపించనుంది. 2017 మార్చిలో టీమిండియా జెర్సీపై బ్రాండ్ హక్కులను ఒప్పో సంస్థ ఐదేళ్ల సమయానికి రూ. 1,079 కోట్లకు దక్కించుకుంది. అయితే ఇంకా రెండళ్లకుపైగా ఒప్పందం ఉన్నప్పటికీ ఒప్పో ముందుగానే తప్పుకుంటోంది. 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇంత మొత్తాన్ని చెల్లించడం తలకు మించిన భారంగా ఉండటంతో ఒప్పో తప్పుకోవాలని చూస్తోందట.  దాంతో మధ్యలోనే అర్థాంతరంగా వైదొలగడానికి సిద్ధమైంది.

కాగా, ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ ఈ హక్కులను ఒప్పో నుంచి అంతే ధరకు సొంతం చేసుకుంది. ఈ సెప్టెంబర్‌ నుంచి 2022 మార్చి వరకు బైజుస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  దీంతో ఈ వెస్టీండీస్ టూర్ వరకూ మాత్రమే ఒప్పో బ్రాండ్ టీమిండియా జెర్సీపై కనిపించనుంది. సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టూర్ సమయానికి టీమిండియా జెర్సీపై బైజూస్ బ్రాండ్ దర్శమిస్తుంది.

మరిన్ని వార్తలు