చైనా కొత్త వైరస్‌ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ

24 Nov, 2023 16:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ (హెచ్‌9ఎన్‌2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏవియన్‌ వైరస్‌ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. 

ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉంది. చైనాలో నమోదవుతున్న శ్వాససంబంధ కేసులన్నీ సాధారణమైనవేనని, వాటికి పెద్ద  ప్రత్యేకత లేదని తెలిపింది. అయినా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చె​ప్పిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంతేగాక ఈ వైర​స్‌ సోకిన వారిలో ఫ్యాటలిటీ రేటు(మరణాల రేటు) తక్కువగా ఉందని వెల్లడించింది.

గతంలో చైనా నుంచే పుట్టుకొచ్చిన కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దీంతో చైనీయుల్లో ఎలాంటి వైరస్‌ కారక వ్యాధుల కేసులు నమోదైనా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అలర్ట్‌ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులపై భారత ఆరోగ్య శాఖ స్పందించింది. ఇటీవల కోయంబత్తూరులో వెలుగు చూసిన వైరస్‌ కేసులు కూడా కరోనా కేసులు కాదనే విషయం స్పష్టమైంది.

ఇదీచదవండి.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా...

మరిన్ని వార్తలు